అన్లాక్ 4 ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు కాస్త రిలీఫ్ అయ్యారు. వ్యాపార వర్గాలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు గత వైభవం మాత్రం రాదు. అయితే నిబంధనలు పాటిస్తూ జీవనం సాగించాలని ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతరాష్ట్ర రవాణాపై తెలుగు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకోనున్నాయి.
ఏపీ, తెలంగాణ మధ్య ఏపీఎస్ఆర్టిసి బస్సులు ఎప్పుడు నడుస్తాయో అర్థం కావడం లేదు. ఇప్పటికే ఓ సారి ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమైన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఒప్పందం ఏ విధంగా ఉండాలన్న దానిపై అధికారులు చర్చించారు. అయితే తుది నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఏపీ నుంచి తెలంగాణాకు ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు బస్సు సర్వీసులు నడుపుతున్నాయి.
ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి 150 బస్ సర్వీసులు నడుస్తున్నాయి. ఈ మేరకు ఆన్లైన్లో బుకింగ్ కూడా ప్రారంభమైంది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా నడిపేందుకు అధికారులు తెలంగాణను మరోసారి కోరారు. రోజుకు 70వేల కిలోమీటర్లు బస్సులు నడిపేందుకు అనుమతులు ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణా ప్రభుత్వాన్ని కోరింది. ప్రైవేటు ట్రావెల్స్కు అనుమతులు ఇచ్చారు కాబట్టి ఆర్టీసీ సర్వీసులు కూడా నడిపేందుకు పర్మిషన్ ఇవ్వాలంది.
ఇప్పుడు 70వేల కిలోమీటర్లు బస్సులు నడుపుతామని.. తెలంగాణ బస్సులు కూడా ఏపీ పరిధిలో ఈ మేరకు బస్సులు నడుపుకోవచ్చని లేఖలో పేర్కొన్నారు. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ప్రతి రోజూ వేలాది మంది హైదరాబాద్ నుంచి ఏపీకి, ఏపీ నుంచి హైదరాబాద్కి ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. విద్య, ఉపాధి, ఉద్యోగాల కోసం ఎక్కువగా హైదరాబాద్పైనే ఆధారపడతారన్న విషయం తెలిసిందే. మరి బస్ సర్వీసుల విషయంలో తెలంగాణ ఏం చెప్పనుందో చూడాలి.