రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక జనాలకు డబ్బులు ఎక్కువగా అందుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పథకాలను ప్రవేశపెడుతున్నారు. దీంతో చిన్న పిల్ల వాడి దగ్గర నుంచి పండు ముసలవ్వ వరకు ఏదో రకంగా నగదు అందుతూనే ఉంది.
అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, సామాజిక పించన్ల పెంపు, రైతు భరోసా ఇలా ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చి ఏపీ సీఎం జగన్ ప్రజల నుంచి మెప్పు పొందారు. దీంతో అన్ని వర్గాల ప్రజలకు ఈ పథకాలను బట్టి నగదు అందుతూనే ఉంది. ఇప్పుడు మరో నగదు బదిలీ పథకం ఏపీలో రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కార్యచరణ సిద్ధమైనట్లు సమాచారం.
రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా ప్రతి నెలా బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ బియ్యం స్థానంలో నగదు అందజేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ కంప్లీట్ అయ్యిందని టాక్. గతంలో టిడిపి ప్రభుత్వమే ఈ ఆలోచన చేసినప్పటికీ దీన్ని ముందుకు తీసుకుపోలేదు. ఇప్పుడు జగన్ వచ్చాక గతంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
రేషన్ దుకాణాల్లో ఇచ్చే లావు బియ్యం చాలా మంది ప్రజలు తినడం లేదు. వీటిని అలాగే పెట్టుకొని బయట మార్కెట్లో సన్న బియ్యం కొనుక్కుంటున్నారు. ఇక ఎన్నికల హామీల్లో భాగంగా జగన్ ప్రజలు తినగలిగే బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. అయితే సన్నం బియ్యం ఇవ్వాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇబ్బందులు కొనితెచ్చుకోవడమే అవుతుందన్న భావన మేధావుల్లో ఉంది. అందుకే ప్రభుత్వం ఆలోచించి నగదు బదిలీ పథకం తీసుకురావాలని అనుకుంటుందట. ఒక వేళ నగదు తీసుకోని వాళ్లకు యథావిధిగా ఆ బియ్యమే సరఫరా చేసేందుకు కూడా కసరత్తులు జరుగుతున్నాయంట. మరి దీనిపై పూర్తి స్థాయి సమాచారం ఇంకా రావాల్సి ఉంది.