ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే ఏపీ మాత్రం వీటికంటే కాస్త ఎక్కువగానే నష్టపోతోంది.
ఏపీలో ప్రతి నెలా అప్పులు లేనిదే రాష్ట్రంలో పనులు జరగడం లేదు. ఉద్యోగుల జీతాల దగ్గర నుంచి సామాజిక పించన్లు, పెన్షన్లు అన్ని అప్పులు తెచ్చిన డబ్బుతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఏపీ అప్పులు చేస్తూ అవసరాలు తీర్చుకుంటోంది. కాగ్ లెక్కల ప్రకారం దీన్ని పరిశీలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 70,329 కోట్లు ఖర్చు చేస్తే ఇందులో రూ. 39,946.30 కోట్లు అప్పుగా తెచ్చుకొన్నవే.
అంటే చేసిన ఖర్చులో సగం కంటే ఎక్కువ అప్పు ద్వారా ఏపీ తీసుకుంది. ఇప్పటివరకు ఏ ఆర్థిక సంవత్సరం ఇలా రుణాలపై ఆధారపడలేదు. అయితే కేంద్రం ఎఫ్.ఆర్.బీ.ఎం చట్ట సవరణకు అనుమతించిన నేపథ్యంలో రుణ పరిమితి పెరుగుతోంది.. దీంతో లెక్కల్లో కూడా మార్పులు వస్తాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడూ లేనంతగా రూ. 32,002 కోట్లు రెవెన్యూ లోటు తేలింది.
ఈ పరిణామాల నేపథ్యంలో గత మూడు నెలల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఆలస్యమవుతున్నాయి. ఇక ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోంది. వివిధ సంక్షేమ పథకాలకు వేల కోట్లు అవసరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఆర్థిక పరిస్థితి కాస్త దెబ్బతిందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఆశలన్నీ వైఎస్ జగన్పైనే ఉన్నాయి. ప్రజల సంక్షేమం కోసం కొత్త పథకాలు తీసుకొస్తున్న జగన్.. రాష్ట్రం ఆర్థిక లోటు నుంచి బయటపడేందుకు కృషి చేయాలని అంతా కోరుతున్నారు.