ఏపీలో నేతల భద్రత పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఏపీమంత్రి కురసాల కన్నబాబుకు భద్రత కల్పించిన తీరు చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతల అంశం తెరమీదకు వస్తోంది.
మంత్రి కన్నబాబుకు హోంశాఖ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. ఇప్పటి నుంచి ఆయన ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే పర్యటనలకు వెళ్లాల్సి ఉంటుంది. మంత్రి భద్రతపై ఇంటెలిజెన్స్ నివేదికలు ఆదారంగా హోం శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వారం రోజుల క్రితం హోంశాఖకు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది.
కన్నబాబు భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది హోంశాఖ. ప్రశాంతంగా ఉన్న ఏపీలో కన్నబాబుకు భద్రత దృష్ట్యా బుల్లెట్ వాహనం కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంటెలిజెన్స్ విభాగం ఎప్పటికప్పుడు భద్రతపై అప్రమత్తంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కన్నబాబు భద్రతకు ప్రమాదం ఉండటంతో హోంశాఖ అప్రమత్తమై బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. దీంతో మరి కొందరు నేతలు కూడా తమ భద్రత దృష్ట్యా హోంశాఖను ఆశ్రయించే అవకాశం ఉంది.
వైసీపీలో కన్నబాబు కీలక నేతగా ఉన్నారు. విశాఖ జిల్లా ఇన్చార్జిగా కూడా ఆయన కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనలు ఎక్కువగానే ఉంటాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కన్నబాబు భద్రత పట్ల ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తంగా ఉంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించడంతో పాటు ఆయన భద్రత పట్ల మరిన్ని చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.