ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్ కేసుల విషయం బయటకు రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. కోర్టుల్లో ఇన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయా అనుకుంటున్నారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన వివరాలు తెలియజేసింది.
రాజ్యసభలో వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వాని అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2,03,024 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. దీంతో పాటు దిగువ కోర్టుల్లో 5,82,069 కేసులు పెండింగ్లో ఉన్నాయని వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 19వ తేదీ నాటికి దేశ వ్యాప్తంగా జిల్లా, సబార్డినేట్ కోర్టులు 15,32,334 కేసులు పరిష్కరించాయని ఆయన అన్నారు.
కాగా ఇటీవల ఏపీలో జరుగుతున్న పరిణామాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. అయితే వీటిని త్వరగా విచారించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇటీవల ఏపీలో ప్రభుత్వం విచారణ చేయాలన్న పలు కేసుల్లో హైకోర్టు స్టే ఇస్తూ వస్తోంది. ప్రధానంగా అమరావతి భూకుంభకోనం కేసులో కోర్టు విచారణను ఆపడమే కాకుండా పలు కీలక సూచనలు జారీ చేసింది. ఈ విషయాన్ని వైసీపీ ఎంపీలు పార్లమెంటులో కూడా ప్రస్తావించారు. ఏపీలో ఎందుకిలా జరుగుతోందో అని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం కావాలని పలువురు కోరుతున్నారు.