అమరావతి భూకుంభకోణంలో ఏసీబీ విచారణపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. హైకోర్టు స్టే ఇవ్వడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రాథమిక దశలోనే స్టే ఇస్తే నిజానిజాలు ఎలా తెలుస్తాయన్నారు. అమరావతిలో అక్రమాలు జరిగాయన్న ఆధారాలు ఉన్నాయన్నారు. ఏ ప్రభుత్వానికైనా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ చేసే అధికారం ఉందన్నారు.
అయితే కక్ష్య పూరితంగా చేస్తున్నారని ఎఫ్.ఐ.ఆర్ ప్రారంభదశలోనే విచారణను నిలిపివేస్తూ తీర్పు ఇస్తే తీర్పును ఎలా అర్థం చేసుకోవాలో అందరూ ఆలోచించాలన్నారు. న్యాయమూర్తులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. తాము అధికారంలోకి వస్తే అమరావతి భూకుంభకోణంపై విచారణ చేస్తామని ముందే చెప్పినట్లు గుర్తు చేశారు. కక్ష్య కట్టారని పిటిషన్ వేస్తే అంతా ఆపేస్తే ఇంకేముంటుందన్నారు. ఎవరి ప్రయోజనాలు రక్షించడానికి ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. ఇక ఈ కేసులో వార్తలు ప్రసారం చేయకుండా మీడియా నోరు నొక్కేయడం ఎంతవరకు సమంజసమన్నారు.
ఇక హైకోర్టు తీర్పు వస్తుందన్న విషయం నిన్న సాయంత్రం ఐదు గంటలకే బోండా ఉమామహేశ్వరరావు చెబుతున్నారన్నారు. ఈ విషయం ఆయనకు ఎలా తెలుసన్నారు. ఇక అప్పట్లో వై.ఎస్ జగన్పై కక్ష్య కట్టి వేశారంటే.. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులు.. ఆరోపణలే కదా విచారణ జరిగితే కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పినట్లు గుర్తు చేశారు. మాజీ ఏజీకి ఉన్న గౌరవం వై.ఎస్ జగన్కు లేదా అని అన్నారు. ఇక జగన్ ప్రభుత్వం నిజంగా కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా టిడిపి నాయకులను చంద్రబాబును, ఆయన కొడుకును వేధించడం కోసం ఇది చేసిందంటే.. దానికి విరుగుడైన తమకు సంబంధంలేని సీబీఐతో విచారణ చేయమని అడుతున్నామన్నారు.
ఇక మరోవైపు రాజధాని భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ కేంద్రాన్ని కోరింది. లోక్సభలో ఈ అంశాన్ని ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో భారీ భూ కుంభకోణం జరిగిందన్నారు. బినామీల పేరుతో వేల ఎకరాలు కొన్నారన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామన్నారు.