ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈయన మృతిపట్ల దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు, ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎందుకంటే ఆయన పాడిన పాటలతో దేశ వ్యాప్తంగా అభిమానులను ఆయన సంపాదించుకున్నారు.
ఇప్పుడు ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లేఖలో ఎస్పీబీ గురించి వివరించారు జగన్. ఈయన 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడారని తెలిపారు. ఇందుకు గాను 6 నేషనల్ ఫిల్మ్ అవార్డులు, 25 నంది అవార్డులు, 6 ఫిల్మ్ ఫేర్ సౌత్ ఇండియన్ అవార్డులు సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా ఆయనకు అవార్డులు వచ్చాయన్నారు. భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు కూడా పొందారని వివరించారు.
దీంతో అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ఏపీ ప్రజల నుంచి ఈ మేరకు విజ్ఞప్తి వచ్చిన గంటల వ్యవధిలోనే సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాయడంపై బాలు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.