ఆంధ్రప్రదేశ్లో కరోనా నివారణ చర్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ స్పందన కార్యక్రమం నిర్వహించారు.
కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ పరీక్షలు కూడా అదేస్థాయిలో చేస్తున్నామని.. రిపోర్టులు కరెక్టుగా వస్తున్నాయని సీఎం అన్నారు. రాష్ట్రంలో రోజుకు 50వేలకు పైగా పరీక్షలు చేస్తున్నట్లు జగన్ తెలిపారు. కోవిడ్ సోకిన వారిని గుర్తించి వారికి వైద్యం అందించాలన్న లక్ష్యంతోనే ముందుకువెళుతున్నట్లు సీఎం చెప్పారు.
లక్షకు పైగా కేసులు నమోదైతే అందులో సగం మందికి పైగా నయమైందని జగన్ అన్నారు. ఇక 85 శాతం మందికి ఇళ్లల్లోనే కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. దేశంలో కరోనా మరణాల రేటు 2.5 శాతం పైగా ఉంటే మనరాష్ట్రంలో 1.06 శాతంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు మన రాష్ట్రంలో అత్యాధునిక ఆస్పత్రులు లేవని.. అయినప్పటికీ మరణాల రేటును 1.06శాతానికి పరిమితం చేశామన్నారు జగన్.
ఇక కరోనా ఎవ్వరికైనా వస్తుందీ పోతుందని.. ప్రజల్లో భయాందోళనలు తగ్గించాలన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలన్నారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు.