ఏపీలో సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్దం ఘటన ఇంకా చర్చకు దారి తీస్తూనే ఉంది. ఈ ఘటనకు సంబందించి సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగా.. ప్రభుత్వం నిజానిజాలు బయటకు తీసేందుకు సీబీఐ విచారణ చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే రథం దగ్దమైన పరిస్థితుల్లో పలువురు వ్యక్తులు ఆందోళనలు చేపట్టారు. వీరిలో 36 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా వీరిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటనలో పాల్గొన్న ఉన్నతాధికారులు అందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఎస్పీ నయీమ్ ఆస్మి, రాజోలు సీఐ దుర్గా శేఖర్ రెడ్డి, ఆయన డ్రైవర్, రైటర్, మరో ఐదుగురు ఎస్ఐలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
వీరితో పాటు అదనపు ఎస్పీ కరణం కుమార్కు కూడా పాజిటివ్ వచ్చింది. వీరంతా ప్రస్తుతం వైద్యుల సలహాలతో చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం జగన్ పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు ఎక్కువవయ్యాన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.