ఇన్ని రోజులు నివర్ తుఫానుతో ఇబ్బందులు పడిన ఆంధ్రప్రదేశ్ వాసులకు మరో తుఫాను గండం పొంచి ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. రానున్న రెండు రోజుల్లో తుఫాను ప్రభావం ఉండనుందని అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నివర్ ప్రభావం ఉన్న తరుణంలోనే మరో తుఫాను వెంటాడుతోందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం హెచ్చరించింది. భూమధ్య రేఖకు సమీపంలో హిందూ మహాసముద్రం దానికి ఆనుకుని దక్షిణ అండమాన్ స ముద్రంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే 36గంటల్లో(29న) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా మారి.. బలపడి తుఫానుగా మారుతుందని, వచ్చే నెల 2న తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరం దాటనుందని ఐఎండీ తెలిపింది.
దీని ప్రభావంతో 1 నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు.. 2న, 5వ తేదీన మరో రెండు తుఫాన్లు వచ్చే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. ఇక అకాల వర్షాలతో ఇటు పబ్లిక్తో పాటు అటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ తుఫాను ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.