దేశంలో ఇటీవల లవ్ జిహాద్ అంశం విపరీతంగా వైరల్ అవుతోంది. లవ్ జిహాద్పై రాజకీయ నాయకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మధ్య ప్రదేశ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు లవ్ జీహాద్కు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.
లవ్ జీహాద్ వల్ల మహిళల ప్రాథమిక హక్కులకు విఘాతం కలుగుతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నేత ఇంద్రేష్ కుమార్ చెప్పారు. లవ్ జీహాద్ నిరోధించేందుకు చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఇంద్రేష్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ, మహిళలపై హింసకు మారు పేరు ‘లవ్ జీహాద్’ అని చెప్పారు. ఓ పురుషుడు తన వివరాలను దాచిపెట్టి, తప్పుడు వివరాలను తెలియజేసి, మహిళను మోసం చేయడానికి దీనిని ఉపయోగించుకుంటున్నారన్నారు.
పురుషుడి ప్రతిపాదనను మహిళ తిరస్కరిస్తే, ఆమెను అతడు బలవంతం చేయడానికి లేదా కాల్చి చంపడానికి కూడా వెనుకాడటం లేదన్నారు. ఇవన్నీ రాజ్యాంగానికి విరుద్ధమని చెప్పారు. దీనిని నిరోధించవలసిన ప్రాథమిక అవసరం దేశానికి ఉందని చెప్పారు. గౌరవప్రదంగా జీవించే హక్కును ప్రతి వ్యక్తికి మన దేశం కల్పించిందన్నారు. ‘లవ్ జీహాద్’ ఈ హక్కులన్నిటినీ కాలరాస్తోందన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకించే ప్రభుత్వాలు ప్రాథమిక హక్కులు నలిగిపోవడాన్ని సమర్థిస్తున్నట్లేనన్నారు. ‘లవ్ జీహాద్’కు వ్యతిరేకంగా చట్టాలను తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నానన్నారు.