ఏపీ మంత్రుల్లో స్ట్రాంగ్ వాయిస్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కొడాలి నాని. ప్రతిపక్ష పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడే మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అందులో ముందు వరుసలో ఉండే వ్యక్తి కూడా ఈయనే. ఈ వ్యవహార శైలే ఇప్పుడు ఆయనపై వ్యతిరేకతను తీసుకొస్తోందా అంటూ ఏపీ రాజకీయాల్లో డిస్కషన్ నడుస్తోంది.
కొడాలి నాని ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అమరావతి రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అసలు రాజధానిగా అమరావతి వద్దని తాను సీఎం జగన్కు చెప్పినట్లు నాని వ్యాఖ్యలు చేయడం దుమారం రేగింది. మూడు రాజధానులపై ఆగ్రహంగా ఉన్న రైతులు నాని వ్యాఖ్యలతో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉండాలని కోరుతూ రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
నేడు కొడాలి నానిని ఉద్దేశిస్తూ మహిళలు చీపుర్లు పట్టుకొని నిరసన తెలిపారు. అమరావతి విషయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు సైతం నానిపై మండిపడుతున్నారు. చంద్రబాబుపై టిడిపి నేతలపై నాని తీవ్ర పదజాలంతో మాట్లాడటం మనకు తెలిసిందే.
తమ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబు తదితర నాయకులు సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పలువురు మంత్రులు సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని నేతలు మండిపడ్డారు. మరి కొడాలి విషయంలో ఏమైనా చర్యలు ఉంటాయో లేదో చూడాలి.