ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అమరావతిలోనే పరిపాలన కొనసాగించాలంటూ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం మూడు రాజధానులపై స్పష్టమైన వైఖరితో వెళుతున్నా వీరి దారిలో వీరు కదులుతున్నారు.
రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు 240 రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా వీరు ఇళ్లల్లోనే నిరసనలు తెలిపారు. తూళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, రాయపూడి, అబ్బిరాజుపాలెం, బోరుపాలెం, యర్రబాలెం, తదితర 29 గ్రామాల ప్రజలు స్వచ్చందంగా ఆందోళనల బాట పడుతున్నారు.
రాజధాని కడతామంటే భాగస్వాములై ఉంటూ భూములు ఇచ్చామని రైతులు అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఇలా చేస్తారా అంటున్నారు. పాలకులు తమను మోసం చేసినా కోర్టులు తమకు న్యాయం చేస్తాయన్న నమ్మకంతో వారు దృఢ నిశ్చయంతో ఉన్నారు. ప్రభుత్వం ఎన్ని విధాలా తమకు సర్దిచెప్పినా అవసరం లేదని.. ఏపీ రాజధాని అంటే అమరావతే ఉండాలన్న నిర్ణయంతోనే తాము శాంతిస్థామని వారు చెబుతున్నారు.
మరోవైపు ఏపీ సర్కార్ రాష్ట్ర రాజధాని విషయంలో ఇప్పటికే ఫుల్ క్లారిటీతో ఉంది. రాష్ట్రంలో మూడు రాజధానులుగా శిశాఖపట్నం, అమరావతి, కర్నూలును ఎంపిక చేసి ఆవిధంగా ప్రక్రియను పూర్తి చేసింది. ఇక మూడు రాజధానులకు శంకుస్థాపనలు చేయడమే ఆలస్యం. ఈ మేరకు ఆనాడు అమరావతిలో శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతోనే ఇప్పుడు కూడా విశాఖ క్యాపిటల్గా శంకుస్థాపన చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై మాట్లాడుతూ అమరావతిలో అవసరమైన అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అమరావతిలో పెండింగ్లో ఉన్న భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఇక విశాఖలో రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
మరి ఆ రోజు ఇదే ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతిగా శంకుస్థాపన చేసిన ప్రధాని.. నేడు మళ్లీ రాజధాని శంకుస్థాపనకు వస్తే దీనిపై తనదైన శైలిలో మాట్లాడతారని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం రాజధాని ఎంపిక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది అని క్లారిటీ ఇచ్చింది. మరీ ఏం జరుగుతుందో చూడాలి.