ఎన్నో వివాదాల అనంతరం విడుదల కాబోతున్న ‘పద్మావత్’ సినిమా కోసం అక్షయ్ కుమార్ తన చిత్రం ‘ప్యాడ్ మ్యాన్’ విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ కోరిక మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిజానికి ఈ రెండు సినిమాలు జనవరి 25న విడుదల కావాల్సి ఉంది.
ఇప్పుడు అక్షయ్ కుమార్ నిర్ణయంతో ‘ప్యాడ్ మ్యాన్’ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలకానుంది.అక్షయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ‘పద్మావత్’ చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు నటి దీపికా పదుకునే, నటులు రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్లు అక్షయ్ కుమార్కి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఈ రెండు సినిమాల మీద భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఒకేరోజు విడుదలైతే నిర్మాతలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్న కారణంగా అక్షయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.