ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వ్యతిరేకత వస్తోంది. దీంతో చాలా మంది కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టులకు వెళుతున్నారు.
ఏపీలో ఇప్పటివరకు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 330 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా దీన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది కోర్టులకు వెళుతున్నారు. దీంతో కోర్టు విచారించి అవసరమైన దాంట్లో స్టే విధిస్తూ ముందుకు వెళుతోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టుకు వెళ్లడం సంచలనాలకు దారితీస్తోందని చెప్పొచ్చు. అమరావతి భూ కుంభకోణం, పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంగ్లీషు మీడియం విద్యతో పాటు మూడు రాజధానుల అంశం ఇలా చాలా విషయాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులకు వెళుతున్నారు.
మరోవైపు ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్గానే ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే అనవసరమైన ఆందోళనలు చేస్తూ అడ్డుకుంటున్నారని ప్రభుత్వ పెద్దలు సైతం ఆవేదన చెందుతున్నారు. ప్రతి పనిలో అడ్డు తగులుతూ అభివృద్ధి జరగకుండా చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైకోర్టు ఓ తీర్పు ఇచ్చింది. ఇందులో ఏముందంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఆ తర్వాతే తమ వద్దకు రావాలని హైకోర్టు తెలిపింది. సమస్య వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అక్కడ పరిష్కారం కాకపోతే కోర్టులను ఆశ్రయించాలని వ్యాఖ్యలు చేసింది. దీని వల్ల ప్రతి దానికీ కోర్టులను ఆశ్రయిస్తున్నవారు ఇప్పటి నుంచి కోర్టులను కాకుండా మొదట ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సి రావొచ్చు.