కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. మొదట్లో గొంతు, శ్వాస సంబంధిత లక్షణాలు మాత్రమే ఉన్నప్పటికీ క్రమేపీ తలనొప్పి, ఒల్లు నొప్పులు, రుచి,వాసన కోల్పోవడం కూడా తోడయ్యాయి. తాజాగా కేంద్రం మరిన్ని విషయాలు వెల్లడించింది. కరోనా వచ్చి కోలుకున్న తర్వాత కూడా దానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయని కేంద్రం సూచించింది. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో పలు కీలక విషయాలు తెలిపింది.
కరోనాను జయించిన వారు కొద్ది రోజుల పాటు జాగ్రత్తగానే ఉండాలని కేంద్రం తెలిపింది. కోవిడ్ సోకిన తర్వాత వారిలో దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఒల్లునొప్పులు ఉంటాయి. అందుకే కరోనా నుంచి బయటపడినా జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో.. కరోనా నుంచి కోలుకున్న వారు కూడా ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం తెలిపింది.
వ్యాధినిరోధక శక్తిని ఇచ్చే ఆహారం తీసుకోవాలని పేర్కొంది. గోరు వెచ్చటి నీటిని తాగుతూనే ఉండాలని తెలిపింది. అయితే అందరూ దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు మాత్రమే దీని నుంచి కోలుకునేందుకు కాస్త సమయం పడుతుందని వెల్లడించింది. అయితే హోం ఐసోలేషన్లో ఉన్నవారికి ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది. ఇక కరోనాను జయించిన వారు వారి అనుభవాలను ఇతరులతో పంచుకోవాలని కోరింది. దీని ద్వారా అందరిలో అవగాహన వచ్చే అవకాశం ఉంది.