బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు హీరో ప్రభాస్. బహుశా బాలీవుడ్ లో అక్కడి హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న సౌత్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఒక్కడే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ప్రభాస్ కున్న క్రేజ్ ను బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఎంతో గొప్పగా వాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన… ఓం రౌత్ ‘ఆది పురుష్’ అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రామాయణ ఇతిహాస నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించనున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది… ప్రభాస్ ‘ఆది పురుష్’ చిత్ర కథను… ఫోన్లోనే విని ఓకే చేశాడట. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చిత్ర దర్శకుడే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు.
ఈ విషయమై ఓం రౌత్ మాట్లాడుతూ… ‘ లాక్ డౌన్ మీద నాకెలాంటి ఫిర్యాదులు లేవు. నేను చదువుకునే రోజుల నుంచి ‘ఆది పురుష్’ సినిమాపై ఆలోచనతో ఉన్నాను. ఇదివరకే ఈ కథాంశంతో ఒక స్క్రిప్ట్ ను రాసుకున్నాను… తాజాగా పాత స్క్రిప్ట్ ను బయటకు తీసి మళ్లీ దాని పై కొంత వర్క్ చేశాను. అనంతరం హీరో ప్రభాస్ కు ఫోన్ చేసి కథను నెరేట్ చేశాను. ప్రభాస్ వెంటనే దానికి ఓకే చెప్పాడు. లాక్ డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత హైదరాబాద్ వచ్చి పూర్తి కథను చెప్పాను’ అని చెప్పుకొచ్చాడీ దర్శకుడు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా.. విడుదల తర్వాత ఎన్ని సంచలనాలకు తెర తీస్తుందో వేచి చూడాలి.