సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమైన ‘పద్మావతి’ చిత్రం కోసం నటులు రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ల కంటే దీపికా పదుకునేకు ఎక్కువ పారితోషికం ముట్టిందని గతంలో బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే దీని గురించి దీపికాను ప్రశ్నించగా ఆమె తికమక సమాధానం చెప్పింది. పద్మావతి 3డీ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో ఆమె మీడియాతో మాట్లాడింది.
‘నా పారితోషికం గురించి మాట్లాడటం అంత ఎగ్జయింట్గా అనిపించదు. కానీ నాకు దక్కిన డబ్బు గురించి గర్వంగా ఉంది. అయితే, ఇక్కడ నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే విషయం ఏమిటంటే, ఈ సినిమా కోసం నిర్మాతలు ఎక్కువ మొత్తం ఖర్చుపెడుతున్నారు. ఇది నాకు గర్వాన్ని కూడా కలిగిస్తోంది’ అని దీపికా అంది.
అయితే ఈ సినిమా కోసం దీపికాకు రూ. 13 కోట్లు, రణ్వీర్, షాహిద్లకు రూ. 10 కోట్ల చొప్పున పారితోషికం అందినట్లు వచ్చిన వార్తల విషయంపై దీపికాను ప్రశ్నించగా… ‘బడ్జెట్, నిర్మాణ విలువల విషయంలో ఇది చాలా పెద్ద సినిమా. బలమైన మహిళా పాత్రలు ఉన్న సినిమాలు మనం చాలానే చూశాం. కానీ మహిళా పాత్రలు ఇంత గొప్పగా సత్తాతో కూడా ఉంటాయన్న విషయంలో మాత్రం ఈ సినిమా మొదటిదే అవుతుందనుకుంటున్నాను’ అంది.