ఓ సినిమాలో తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే కుదుటపడాలని ఓ స్వామీజీ మాటలు విని బిక్షాటన చేస్తాడు హీరో. ఇప్పుడు ఓ వ్యక్తి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బిక్షాటన చేస్తున్నాడు. ఇది జరుగుతోంది బీహార్ రాష్ట్రంలో. ఝాఝా అసెంబ్లీ స్థానం నుంచి పుష్పం ప్రియాకు చెందిన ప్లురల్స్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న సూర్యవత్స బిక్షమెత్తుకుంటున్నారు.
మామూలుగా నామినేషన్ వేయడానికి ఖరీదైన కార్లలో రావడం, చుట్టూ తన బలగాన్ని చూపించుకోవడం మామూలే. కానీ ఈయన మాత్రం సింగిల్గా నామినేషన్ వేసేందుకు వచ్చారు. అంతేకాకుండా నామినేషన్ వేసేందుకు డబ్బులు లేకపోవడంతో బిక్షం ఎత్తుకొని వచ్చిన డబ్బులతో నామినేషన్ రుసుము చెల్లిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఎన్నికల కార్యాలయం దగ్గరున్న వారంతా షాక్కు గురయ్యారు.
విషయమేమిటని ఆరా తీయగా అతను చెప్పిన మాటలు విని అంతా షాకయ్యారు. తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అయితే తనకు నామినేషన్ వేయడానికి కూడా డబ్బులు లేవని చెప్పారు. దీంతో బిక్షం ఎత్తుకొని వచ్చిన డబ్బులతో నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. ఇక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా తన వద్ద డబ్బులు లేవని.. బిక్షమెత్తుకొని వచ్చిన డబ్బుతోనే పోటీ చేస్తానన్నారు. ఇక సూర్యవత్స గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
సమాజ సేవకునిగా పనిచేస్తున్న సూర్యవత్స ఏడాది పొడవునా రెండు జతల దుస్తులతోనే గడుపుతారంట. చలికాలంలో రైల్వే స్టేషన్ల వద్ద ఉండే పేదలకు కంబళ్లను పంచుతుంటారని తెలిసింది. ఇక పేదల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించాలనే ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని సూర్యవత్స తెలిపారు. మొత్తానికి సూర్యవత్స ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా నిలిచారు. మరి ఆయన ఎలా పోటీ చేస్తారో.. ఎన్నికల్లో ప్రజల మద్దతు ఎలా కూడగడతారో చూడాలి.