వైద్య శాస్త్రంలో అద్బుతాలు జరుగుతాయని మనం సినిమాల్లో వింటూ ఉంటాం. పక్షవాతంతో పడిపోయిన వ్యక్తులు ఇష్టమైన సంగీతం వింటే లేచి కూర్చోవడం మనం చూస్తూ ఉంటాం. అచ్చం అలాంటిదే ఇప్పుడు జరిగింది.
60 రోజులుగా కోమాలో ఉన్న వ్యక్తి తనకు ఇష్టమైన ఫుడ్ గురించి చెప్పగానే వెంటనే లేచి కూర్చోవడం జరిగింది. ఇది అందరినీ ఆశ్చర్య పరిచింది. వివరాల్లోకి వెళితే తైవాన్కు చెందిన ఛియు (18) యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. ప్రమాదంలోనే అతడు తీవ్రమైన కోమాలోకి వెళ్లిపోయాడు. ఛియుకి చాలా చోట్ల బలమైన గాయాలు అయ్యాయని, ఇప్పట్లో కోలుకోవడం కూడా చాలా కష్టమని ఆ యువకుడికి చికిత్స చేస్తున్న ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
అయితే ఇదే సమయంలో హాస్పిటల్లో ఉన్న తన స్నేహితుడిని పరామర్శించేందుకు వచ్చిన ఛియు స్నేహితుడు నీకు ఇష్టమైన చికెన్ ఫిల్లెట్ తినడానికి వెళ్తున్నా అని చెప్పి లేచాడు. దీంతో వెంటనే బెడ్పై పడుకున్న ఛియు ఆరోగ్యంలో కీలక మార్పులు వచ్చాయి. సెకన్లలో అతని పల్స్ రేటు అమాంతం పెరిగిపోయింది. అక్కడున్న కుటుంబ సభ్యులు, వైద్యులు అందరూ షాక్ అయ్యారు. ఛియు ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయి ఇంటికి వెళ్లిపోయాడు.
ఈ మధ్యే ఆసుపత్రికి వచ్చిన తనకు వైద్యం అందించిన వారితో కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నాడు. అంతే కాదు వైద్యం చేసే సమయంలో అతడి పట్ల ఎంతో కేర్ను ప్రేమను చూపించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఇలాంటివి వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.