కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 265 మంది ఖైదీలకు కరోనా సోకింది. ప్రస్తుతం వీరంతా జైల్లోనే చికిత్స పొందుతున్నారు.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 265 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ మురళీధర్ ఆదేశాల మేరకు ఈ నెల 3వ తేదీన 900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 247 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో మొత్తం 1675 మంది ఖైదీలు ఉన్నారు. ఈ నెల 1వ తేదీన 75 మందికి కరోనా పరీక్షలు చేయగా 24 మంది సిబ్బందికి, 9 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. 2వ తేదీ చేసిన పరీక్షల్లో 9 మంది ఖైదీలకు కరోనా నిర్దారణ అయ్యింది.
సెంట్రల్ జైలులో మొత్తం 265 మంది ఖైదీలకు కరోనా సోకింది. ఇంత మంది ఖైదీలను ఆసుపత్రికి తరలిస్తే సెక్యూరిటీ సమస్యలు వస్తాయన్న కారణంతో జైలులోనే పెట్టి చికిత్స అందిస్తున్నట్లు జైలు సూపరింటెండెంటు ఎస్. రాజారావు తెలిపారు. కరోనా సోకిన జైలు సిబ్బంది మాత్రం హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.