ప్రపంచంలో కరోనా విలయతాండవం చేస్తోంది. అమెరికాలో ఒక్క రోజులోనే 2500 మంది చనిపోయారు. ఇలాంటి పరిస్థితి ఏప్రిల్ నెలలో ఉంది. ఆరు నెలల తర్వాత మొదటి సారి ఇంత పెద్ద మొత్తంలో అమెరికాలో ఇప్పుడే మరణాలు నమోదయ్యాయి.
అమెరికాలో ముందునుంచీ కొత్త కేసులు, మరణాలు ఎక్కువగానే ఉన్నాయి. ట్రంప్ అమెరికాలో కరోనా కట్టడికి సరైన చర్యలు తీసుకోలేదని ప్రచారం ఉంది. దీంతో అప్పటి నుంచే అమెరికాలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అంత పెద్ద మొత్తంలో కరోనా విజృంభిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో పండుగ వాతావరణం నెలకొంది. దీంతో ప్రజలంతా విచ్చలవిడిగా తిరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఇంత ఎక్కువ మరణాలు నమోదవ్వడం అత్యంత ఆందోళనకరమని వైద్యులు చెబుతున్నారు.
అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు 1,80,000 కొత్త కేసులు నమోదయ్యాయి. 2500 మంది చనిపోయారు. ఈ వివరాలు జాన్స్ హాప్కీన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. అమెరికాలో ఇప్పటి వరకు కరోనా కేసులు 1.37 కోట్లకు చేరుకోగా.. మరణాలు 2,70,000 చేరుకున్నాయి. ఇక వ్యాక్సిన్ విషయంలో కూడా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఫైజర్ సంస్థ అత్యవసర వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతులు ఇవ్వాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచానికి మంచిది కాదని మేధావులు అంటున్నారు.