దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా పలు రాష్ట్రాలలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో పలు రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ప్రజలకు ఏ చిన్న జబ్బు వచ్చినా ఆందోళన చెందుకుండా ఉండేందుకు పలు రకాల చర్యలు తీసుకుంటున్నాయి.
రాష్ట్రంలో ఎనిమిది నెలలుగా ప్రజలను ముప్పు తిప్పలు పెట్టిన కరోనా మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టేందుకు గాను అన్నాడీఎంకే ప్రభుత్వం సోమవారం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. కరోనా బాధితులను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణ చికిత్స, వైరస్ సోకకుండా ముందస్తు వైద్యపరీక్షలు నిర్వహించడానికి గాను రాష్ట్రవ్యాప్తంగా రెండువేల ‘అమ్మా మినీ క్లినిక్’లను ఏర్పాటు చేస్తోంది. రాజధాని నగరం చెన్నైలో 200ల మినీ క్లినిక్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో గత మూడు నెలలుగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా లాక్డౌన్ను పలు సడలింపులతో అమలు చేస్తున్నారు. వైరస్ బారినపడి మృతి చెందే వారి సంఖ్య కూడా రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది.
అయితే ప్రజలలో కరోనా భయం ఇంకా తగ్గలేదు. జలుబొచ్చినా, దగ్గొచ్చినా, జ్వరమొచ్చినా కరోనా వైరస్ తమకు సోకిందేమోనని అనవసరంగా భయపడుతున్నారు. ఈ భయాందోళన పోగొట్టేం దుకు ఈ ‘అమ్మా మినీ క్లినిక్కులు’ దోహదపడ తాయని ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మినీ క్లినిక్లో ఓ డాక్టర్, ఓ నర్సు, ఓ సహాయకుడు ఉంటారని ఆయన చెప్పారు. ఈ క్లినిక్లలో జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నవారు వైద్యపరీక్షలు చేసుకుని తగు చికిత్సలు పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ క్లినిక్ల్లో సేవలందించడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఐదువందలమందికి పైగా డాక్టర్లను నియమించింది.