ఏపీలోని చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో వైసీపీ కార్యకర్త హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వెళ్లారు. ఎంపీ కారును స్థానికంగా ఉన్న రజినీ వర్గీయులు అడ్డుకున్నారు. సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని ఎంపీని నిలదీశారు. ఆయన కారుకు అడ్డుపడి వాగ్వాదానికి దిగారు.
తాజాగా వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పర్యటనను వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజినీ వర్గీయులు అడ్డుకోవడంతో వైసీపీలో విభేదాలు వీధినపడ్డాయి.
గతంలో పురుషోత్తమ పట్నంలోనూ ఎంపీని ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడం గమనార్హం. ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యే విడదల రజినీ వర్గం అడ్డుకోవడంతో వైసీపీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. ఎమ్మెల్యే విడుదల రజినీ నియోజకవర్గాన్ని సామంత రాజ్యంలా పాలిస్తున్నారనే ఆరోపణలు ఎంపీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
దీంతో సీరియస్ అయిన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు ఇది అనధికార కార్యక్రమం అని ఎప్పుడైనా రావచ్చని.. ఇబ్బంది కలిగించవద్దంటూ రజినీ వర్గీయులను హెచ్చరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వచ్చి ఇరువర్గాలను శాంతింపచేసి అక్కడి నుంచి పంపించేశారు.