తెలుగులో ఉన్న ప్రముఖ నవాల రచయితల్లో యండమూరి వీరేంద్రనాథ్ ఒకరు. ఈయన రాసిన ఎన్నో నవలలు వెండితెరపై కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా యండమూరి రాసిన మరో నవల దృశ్య కావ్యంగా తెరకెక్కనుంది. అయితే ఆ చిత్రాన్ని హాలీవుడ్లో తెరకెక్కిస్తుండడం విశేషం. వీరేంద్రనాథ్ రాసిన ‘ఆనందో బ్రహ్మా’ నవల సినిమా హక్కులను అమెరికాలో స్థిరపడ్డ ప్రముఖ తెలుగు దర్శక నిర్మాత ముక్తేశ్ రావు మేక సొంతం చేసుకున్నారు. ముక్తేశ్ రావు ఇప్పటికే మూడు హాలీవుడ్ సినిమాలు నిర్మించారు. ఇప్పుడు ఈ నవల ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక ‘ఆనందో బ్రహ్మ’ నవల కథ విషయానికొస్తే.. ఓ పల్లెటూరి యువకుడు పట్నం వస్తే.. అతడిని ఓ గృహిణి చేరదీస్తుంది. వారిద్దరి మధ్య ఉన్నది ఏంటి? ప్రేమా? ఆకర్షణా? అనుబంధమా? సెక్సా? అనే ఆకట్టుకునే కథనంతో యండమూరి ఈ నవల అల్లారు. ఆత్మీయానుబంధాల కలబోతగా ఉండే ఈ నవలను అధునాతన టెక్నాలజీతో ముక్తేశ్ రావు మేక తెరకెక్కించనున్నారు. గోదావరి తీరాన సాగే కథను విదేశాల నేపథ్యంలో ఎలా తెరకెక్కిస్తారన్న ప్రశ్నకు ముక్తేశ్ రావు సమాధానమిస్తూ.. ‘గోదావరి తీరాన సాగే కథను మిసిసిప్పీ తీరాన కూడా నడిపించవచ్చు. ఇదొక యూనివర్సల్ స్టోరీ. నా 35 ఏళ్ల కల సాకారమవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు ముక్తేశ్ రావు. దీంతో ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో ‘ఆనందో బ్రహ్మ’ నవలపై ఆసక్తి పెరిగింది.