సైబర్ నేరగాళ్లు కొత్త తరహా చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్లనీ వీళ్లని ఎందుకు పోలీసులనే టార్గెట్ చేద్దామనుకున్నారు. ఎవ్వరు ఊహించని విధంగా ఫేస్ బుక్ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బులు దండుకోవాలని చూసి అడ్డంగా బుక్కయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎవ్వరికి అనుమానం రాకుండా పోలీసుల ద్వారానే డబ్బులు కాజేయాలని చూశారు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు డిపార్టుమెంటులో అలజడి సృష్టిస్తోంది. తిరుమల, తిరుపతికి సంబంధించిన ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైల ఫేస్ బుక్ ఖాతాలు హ్యాక్కు గురయ్యాయి. హ్యాకర్లు వీరి ఖాతాల నుంచి ఫేస్బుక్ ఫ్రెండ్స్కు డబ్బులు పంపాలంటూ మెసెంజర్ ద్వారా మెసేజ్ పంపారు. అయితే ఏమైందో కానీ డౌట్ వచ్చి సదరు వ్యక్తులు ఫోన్ చేసి విషయం తెలుసుకోగా అసలేం జరిగిందో అన్న ఆందోళన నెలకొంది.
ఫైనల్గా తమ ఫేస్ బుక్ను ఎవరో హ్యాక్ చేశారని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో వెంటనే స్పందించి తమ ఫేస్బుక్ అకౌంట్స్ హ్యాక్కు గురయ్యాయని.. తమ పేరుతో వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని కోరారు. ఆ తర్వాత సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. ఫేస్బుక్ ఖాతాలు బ్లాక్ చేశారు. ఫేస్బుక్ అకౌంట్స్ హ్యాక్కు గురైన వారిలో సీఐలు రామకృష్ణ, గిరిధర్, ఎస్సైలు తిమ్మయ్య, సుమతి ఉన్నారు. పోలీసులకే ఇలా జరిగిందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏందన్న ఆందోళన పబ్లిక్లో నెలకొంది.