భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. అభివృద్ధి విషయంలో సహకరించుకుంటూ ముందుకు సాగాల్సిన దేశాలు ఇలా విభేధాలు పెట్టుకోవడం చర్చకు దారితీస్తోంది. ఇటీవల భారత్ విషయంలో కెనడా వ్యవహరించిన తీరే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
కెనడాకు భారత్ ఝలక్ ఇచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిపై చర్చించే సమావేశానికి తాము రాలేమని భారత్ నిర్మొహమాటంగా కెనడాకు చెప్పింది. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల విషయంలో కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను గమనంలోకి తీసుకునే భారత్ ఈ సమావేశానికి గైర్హాజర్ కావాలని నిర్ణయిచుకున్నట్లు సమాచారం. ‘షెడ్యూలింగ్’ సమస్యల కారణంగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సమావేశానికి హాజరు కాలేరని కెనడా ప్రభుత్వానికి భారత్ తెలియజేసింది.
‘‘కెనడా విదేశాంగ మంత్రి ఫిలిప్పీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7 న జరగబోయే సమావేశానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ షెడ్యూలింగ్ కారణాల రీత్యా హాజరు కాలేరు.’’ అని భారత అధికారులు కెనడా అధికారులకు తేల్చి చెప్పారు. కెనడా విదేశాంగ మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిఫ్ నేతృత్వంలో ‘‘మినిస్టీరియల్ కో ఆర్డినేషన్ గ్రూప్ ఆఫ్ కోవిడ్’ సమావేశం గత నెలలో జరిగింది. ఈ వర్చువల్ సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. మరి ఇరు దేశాల మధ్య వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.