నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం వైఎస్ జగన్ ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను వినిపించడానికి వారితో కలిసి పనిచేయడానికి తను ఎదురు చూస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు
కాగా, ఆంధ్రప్రదేశ్లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్సీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో ఒక్కో వైసీపీ అభ్యర్థికి ఏకంగా 38 ఓట్లు వచ్చాయి. అంటే మొత్తం వైసీపీకి 152 ఓట్లు పోలయ్యాయి. 151మంది వైసీపీ ఎమ్మెల్యేలతోపాటు జనసేన ఎమ్మెల్యే ఓటు కూడా వైసీపీకే పడినట్టు తెలుస్తోంది. ఇక వర్ల రామయ్యకు కేవలం 17ఓట్లు వచ్చి ఓడిపోయారు.
కాగా మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలు 23మంది ఉండగా.. వర్ల రామయ్యకు 17 ఓట్లు మాత్రమే రావడం టీడీపీకి షాకింగ్ గా మారింది. టీడీపీ విప్ జారీ చేసినా ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఓటు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది