— mmkeeravaani (@mmkeeravaani) September 22, 2020
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు కీరవాణి. ఇదిలా ఉంటే తాజాగా ఓ వింత వ్యాధికి సంబంధించిన వివరాలను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రజల్లో ఆ వ్యాధిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియోలో కీరవాణి మాట్లాడుతూ..’ఇటీవలే ఎం.ఎస్.(మల్టిపుల్ స్కెలెరోసిస్) అనే వ్యాధి గురించి తెలిసింది. ఇది ఎవరికైనా, ఎప్పుడైనా, ఏ వయసు వారికైనా రావచ్చు. ఇది శరీరానికీ మెదడుకూ మధ్య ఉన్న అనుసంధాన వ్యవస్థను దెబ్బతీస్తుంది. మల్టిపుల్ స్కెలెరోసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంతో కృషి చేస్తోంది.
అంతేకాదు, ఈ వ్యాధి గురించి ప్రభుత్వానికి తెలిసేలా దీనిపై అవగాహన ఉన్న వారితో కలిసి తన గళాన్ని వినిపిస్తోంది. ఈ సందర్భంగా అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. ఈ సమస్యతో బాధపడే వారికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఎంతో అవసరం. యోగా సాధన, శ్రావ్యమైన సంగీతం ఇలా అన్ని మార్గాల్లోనూ వారిలో మనో ధైర్యాన్ని నింపేలా ప్రోత్సహించండి’ అంటూ ఆ వింత వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు కీరవాణి.