కరోనా పరిస్థితులు ఇప్పట్లో దారిలోకి వచ్చేలా లేవు. దీంతో ప్రపంచ దేశాల్లో ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే దీన్ని నుంచి బయట పడేందుకు భారత్ సహా చాలా దేశాలు లాక్డౌన్ ఎత్తివేశాయి. అయితే ఈ సంవత్సరం కంటే 2021 పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ ఆహార కార్యక్రమం ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బేస్లీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా వ్యాపార రంగం నిలిచిపోయి ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పెరిగిపోయిందన్నారు. దాదాపుగా అన్ని దేశాలు లాక్డౌన్ను ఎత్తేసినప్పటికీ ఆర్థిక పరిస్థితులు కుదుటపడడం లేదు. కాగా, వచ్చే ఏడాది ఈ యేడాది కంటే కూడా మరింత ప్రమాదకరంగా ఉండబోతోందన్నారు. కోవిడ్-19 అనే విపత్తు 2021 ఏడాదిని మరింత కబలించబోతోందని తెలిపారు.
కరోనా రెండో సారి తీవ్రతరం అవుతుందన్న వార్తలపై ఆయన స్పందించారు. బ్రిటన్ లాంటి దేశాలు మరోసారి లాక్డౌన్ అమలు చేస్తున్నాయని చెప్పారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నామని ప్రకటించిన తర్వాత న్యూజీలాండ్ లాంటి దేశాల్లో మరోసారి కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయని పేర్కొన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థపై మరింత తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని డేవిడ్ బేస్లీ చెప్పారు. ఈ వ్యాఖ్యలు వింటే ఇప్పటి కంటే మరింత ఆర్థిక ఇబ్బందులు భవిష్యత్తులో తలెత్తే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు. కాగా ఇప్పటికే మన దేశంలో లాక్డౌన్ ఎత్తివేశారు. దీంతో అన్నీ తెరుచుకుంటున్నాయి. అయితే కరోనా రెండోసారి వచ్చిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కాగా ఇప్పటికే పలు కంపెనీలు ఇంకా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాయి.