దేశంలో కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఢిల్లీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేశ రాజధానిలో కేసులు పెరుగుతున్నాయంటే ఆందోళన కలిగించే అంశమే. దేశ రాజధానిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.67 లక్షలకు చేరింది.
బుధవారంనాడు 8,593 కరోనా కేసులు నమోదు కాగా, 85 మంది మృత్యువాత పడ్డారు. ఢిల్లీలో రికార్డు స్థాయిలో మంగళవారం 104 మరణాలు సంభవించడం, మృతుల సంఖ్య 7,332కు చేరింది. దీంతో ఢిల్లీ గురించి చర్చ మొదలైంది. కరోనా కేసులు పెరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదలకు కాలుష్యమే కారణమని కేజ్రీవాల్ అన్నారు. రాబోయే 7 నుంచి 10 రోజుల్లో వైరస్ వ్యాప్తిని అదుపులోకి తెస్తామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
కేసుల పెరుగుదలకు అతిపెద్ద కారణం కాలుష్యమేనని, ఢిల్లీలో కరోనా కేసులు పెరగక్కుండా నిరోధించినప్పటికీ కాలుష్యం పెరగడం మొదలైన తర్వాత కోవిడ్ కేసులు కూడా పెరిగాయని ఒక బహిరంగ ప్రకటనలో తెలిపారు. కాగా కాలుష్యం పెరుగుదలకు పలు ప్రాంతాల్లో రైతుల పంటలు కాల్చివేతలే కారణం అన్న విషయం తెలిసిందే. మొత్తానికి కరోనా రెండో సారి విజృంభిస్తుందన్న నేపథ్యంలో ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.