సామాజిక మాధ్యమాల్లో ఏ విషయమైన ఎక్కువగా ప్రచారం జరుగుతోందంటే దాని ఎఫెక్టు రియల్ లైఫ్లో చాలా ఉంటుంది. ఇప్పుడు ట్విట్టర్లో కూడా ఓ అంశం ట్రెండ్ అవుతోంది. అవే బీహార్ ఎన్నికల గురించి. ఎన్నికలు పూర్తయి ఎన్డీయే విజయం సాధించినా ఇంకా ట్విట్టర్లో బీహార్ అంశం టాప్లో ఉండటమే ఇప్పుడు పెద్ద విషయం.
అసలేం జరిగిందంటే.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి (మహాగట్బంధన్) విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు చెప్పటినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే విజయం సాధించింది. 125 స్థానాలతో ఎన్డీయే అధికారాన్ని నిలబెట్టుకోగా మహాకూటమి 110 స్థానాలకే పరిమితమైంది. కానీ ఓట్ల శాతంలో మహాగట్బంధన్ ముందు ఉన్నప్పటికీ ఎన్డీయేకు ఎక్కువ సీట్లు రావడం ఏంటని ప్రతిపక్ష నేతల వాదన. చాలా స్థానాల్లో తక్కువ మెజారిటీతో ఎన్డీయే అభ్యర్థులు గెలవడాన్ని ఆర్జేడీ సవాల్ చేస్తోంది. తమ అభ్యర్థులు గెలిచారని ముందు ప్రకటించినప్పటికీ ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిళ్లకు తలొగ్గి ఎన్డీయే అభ్యర్థులను విజేతలుగా ప్రకటించారని ట్విట్టర్ ద్వారా తేజస్వీ యాదవ్ అన్నారు.
తాజాగా నెటిజెన్లు సైతం ఈ విషయమై నినదిస్తున్నారు. ఈరోజు ఇండియా ట్విట్టర్ ట్రెండింగ్లో ‘‘బిహార్ రీకౌంటింగ్ కోరుతోంది’’ అనే హ్యాష్ట్యాగ్ మొదటి స్థానంలో ఉంది. ఈ హ్యాష్ట్యాగ్పై ఇప్పటికే 1.12 లక్షల ట్వీట్లు చేశారు. ఎన్నికల సంఘం విశ్వాసం పోగొట్టుకుంటుందని, స్వతంత్ర సంస్థ ప్రభుత్వానికి అనుకూలంగా లేదని నిరూపించుకోవాలంటే మళ్లీ రీకౌంటింగ్ చేయాలని నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు.