దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని అంటున్నారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇప్పుడే పలు రాష్ట్రాలు స్కూళ్లు తెరవకూడదని నిర్ణయించగా.. ఇప్పటికే తెరిచిన స్కూళ్లను మూసివేస్తున్నారు.
ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా స్కూళ్లను తెరవనే లేదు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని పలు రాష్ట్రాలలో పాఠశాలలను తెరిచారు. అయితే ఉన్నట్టుండి స్కూల్స్ ఓపెన్ అయ్యాక కేసులు పెరుగుతున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ పాఠశాలలు మూసివేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
హిమాచల్ప్రదేశ్లో ఇటీవలే తెరిచిన స్కూళ్లను తిరిగి మూసివేశారు. స్కూళ్లు తెరిచిన నాలుగు రోజుల వ్యవధిలో ఏకంగా 92 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలను నవంబరు 25 వరకూ మూసివేయాలని నిర్ణయించింది. ఉత్తరాఖండ్ లోని ప్రభుత్వ పాఠశాల్లో పనిచేసే 80 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది. దీంతో వెంటనే స్కూళ్లను మూసివేశారు. విధులలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు.
మిజోరంలో అక్టోబరు 16న పాఠశాలలు తెరవగా, కొద్ది రోజుల్లోనే పలువురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో అక్టోబరు 25నుంచి తిరిగి స్కూళ్లను మూసివేశారు. ఇక అసోంలో నవంబరు 2 నుంచి స్కూళ్లు తెరిచారు. అయితే కరోనా ముప్పు భయంతో స్కూళ్లను తిరిగి మూసివేయాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఏపీలో కూడా స్కూల్స్ ఓపెన్ అయ్యాక పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు.