ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వర్షాలు పడతాయని తెలుస్తోంది. పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలో రానున్న నాలుగైదు గంటలు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు హెచ్చరించారు. కాగా వర్షాల పేరు చెబితేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇటీవల కురిసిన ఎడతెరపిలేని వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో మరోసారి వర్షాలు అంటేనే భయపడిపోతున్నారు.