ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు పండుగలను కూడా జరుపుకోవడానికి ఆంక్షలు పెట్టారు. పండుగల సందర్బంగా ప్రజలంతా ఒక చోట చేరితో కరోనా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన ఉంది. ఈ పరిస్థితుల్లో పరిమిత సంఖ్యలో సామాజిక దూరం పాటిస్తూ పండుగలు చేసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి.
ఇప్పుడు మరో పెద్ద పండుగ దీపావళి వస్తోందిం. ఈ నెల 14వ తేదీన దీపావళి, 30వ తేదీన కార్తీక పూర్ణిమ ఉంది. దీంతో ప్రజలు బాణాసంచాను పెద్ద ఎత్తున కాల్చి సంబరాలు చేసుకుంటారు. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై నిషేధం విధించాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భంగా ఒడిశా రాష్ట్రం కూడా బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధించింది. దీపావళి, కార్తిక పూర్ణిమ పండుగల సందర్భంగా బాణసంచా విక్రయించరాదని, కాల్చరాదని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నెల 10 నుంచి 30వతేదీ వరకు బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏకే త్రిపాఠి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
చలికాలంలో కరోనా వ్యాప్తి పెరుగుతుందని వచ్చిన వార్తలతో ఒడిశా సర్కారు బాణసంచాపై నిషేధం విధించింది. బాణసంచా కాల్చడం వల్ల కరోనాతో హోం ఐసోలేషన్ లో ఉన్న రోగులు ఇబ్బందులు పడతారని, శ్వాసకోశ సమస్యలున్న వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బాణసంచాపై నిషేధం విధించామని ఒడిశా అధికారులు వివరించారు. గతంలో రాజస్థాన్ రాష్ట్రం కూడా దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయాలను నిషేధించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కాలుష్యం పెరగకుండా బాణసంచాపై నిషేధం విధించామని అధికారులు చెప్పారు. ఎవరైనా ఈ నిషేధాన్ని ఉల్లంఘించి బాణసంచాను విక్రయించినా, కాల్చినా డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్టు 2005 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రధాన కార్యదర్శి హెచ్చరించారు. చలికాలంలో బాణసంచా కాల్చి వాతావరణాన్ని కలుషితం చేయవద్దని అధికారులు సూచించారు.
దీపావళి సందర్భంగా ప్రజలు సంప్రదాయబద్ధంగా దీపాలు వెలిగించి ఉత్సవం జరుపుకోవాలని అధికారులు సూచించారు. మరి ఈ రాష్ట్రాల బాటలోనే ఇతర రాష్ట్రాలు కూడా నిషేధం విధిస్తాయా అన్నది చూడాల్సి ఉంది. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు పని చేయాలని పలువురు కోరుకుంటున్నారు.