కరోనా పరిస్థితులు చక్కబడుతున్న వేళ దాదాపుగా అన్నింటిలో సడలింపులు ఇస్తూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పలు రాష్ట్రాలలో సినిమాథియేటర్లు తెరుచుకుంటున్నాయి. తమిళనాడులో కూడా త్వరలోనే సినిమా థియేటర్లు ఓపెన్ అవ్వనున్నాయి.
ఈ నెల 10వ తేదీ నుంచి సినిమాలు చూసే వాళ్లకు గుడ్ న్యూస్ చెబుతూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లలో పాటించాల్సిన నిబంధనలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల ఒకటి నుంచి రాష్ట్రంలో మరిన్ని సడలింపులతో లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 10 నుంచి యాభై శాతం ప్రేక్షకులను అనుమతించి సినిమా థియేటర్లలో ప్రదర్శనలు వేయవచ్చునని ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లలో పాటించాల్సిన నిబంధనల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.
థియేటర్లు ఓపెన్ అవుతున్నా నిబంధనలు మాత్రం పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ మేరకు సినిమా థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాల్సి వుంటుంది. థియేటర్లలో ప్రేక్షకులు, సిబ్బంది తప్పకుండా మాస్కులు ధరించాలి. థియేటర్లోకి అనుమతించే ప్రతి ప్రేక్షకుడికి థర్మల్స్కాన్ చేయాలి. ప్రేక్షకులంతా చేతులను శానిటైజర్తో శుభ్రపరచుకోవాలి. ప్రతి ప్రదర్శన ముగియగానే థియేటర్ లోపలంతా క్రిమినాశనితో శుభ్రం చేయాల్సి ఉంటుంది. ప్రేక్షకులు, సిబ్బంది విధిగా భౌతిక దూరం పాటించాలి. కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో థియేటర్లలో ప్రదర్శనకు అనుమతించరు.