దేశంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల పేర్లు చెప్పమంటే ముందుగా అందరూ చెప్పే సమాధానం ఢిల్లీ అని. ఎందుకంటే అక్కడ ఉండే కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఎంతో మంది ఆందోళనలు కూడా చేశారు.
అయితే ఇప్పుడు అక్కడ గాలితో పాటు, నీరు కూడా కలుషితం అయ్యిందన్న ఆందోళన ఎక్కువైంది. నగరానికి యమునా నది నుంచి నీరు సరఫరా అవుతుంది. ఈ నీటిలో అమ్మోనియా ప్రమాదకర స్థాయికి చేరిందని వెల్లడైంది. ఇప్పటికే గాలి కాలుష్యంతో బాధపడుతున్నవారికి నీటి కాలుష్యం వార్తలు వణుకు తెప్పిస్తున్నాయి. ఈ గాలి, నీరు వల్ల తమ ఆరోగ్యం ఎంతగా చెడిపోతుందోనని ఢిల్లీవాసులు భయపడుతున్నారు. ఢిల్లీ జల మండలి విడుదల చేసిన ప్రకటనలో యమునా నది నీటిలో అమ్మోనియా స్థాయి తగ్గే వరకు లో ప్రెషర్తో నీటిని సరఫరా చేస్తామని తెలిపింది.
దీంతో ప్రజలు చాలా ఆందోళనకు గురవుతున్నారు. తమ ఆరోగ్యాలు దెబ్బతినడం ఖాయమని ఆవేదన చెందుతున్నారు. గాలిలో ఉండే అమ్మోనియా వల్ల మానవుల కళ్ళు, గొంతు, ఊపిరితిత్తులు, ముక్కు మండుతున్నట్లు అనిపిస్తాయి. తాగే నీటిలో అత్యధిక అమ్మోనియా ఉంటే అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. కొన్ని సందర్భాల్లో చర్మంపై కాలినట్లు మచ్చలు ఏర్పడవచ్చు. మితిమీరిన అమ్మోనియా ఉన్న నీటిని వాడటం వల్ల కలిగే దుష్ఫలితాలను ఒరెగావ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ సర్వీసెస్ వివరించింది. ఇన్ని రోజులు గాలి కాలుష్యంపై ఢిల్లీలో నిరసన తెలిపేవారు ఇప్పుడు నీటి కాలుష్యంపై కూడా నిరసన తెలిపే అవకాశం ఉంది. మరి దీనిపై పూర్తి స్థాయిలో శ్రద్ద పెట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి.