రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే సమయం కాని సమయంలో కురుస్తున్న ఈ అకాల వర్షాలు ఎందుకు వస్తున్నాయన్న దానిపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. లాక్డౌన్ విధించడం కూడా వర్షాలు పడేందుకు కారణం అని తేల్చారు.
మార్చి 22న దేశం మొత్తం లాక్డౌన్ విధించి విషయం తెలిసిందే. అప్పటి నుంచి జులై వరకు అందరూ ఇళ్లల్లోనే ఉండిపోయారు. దీంతో ఈ మార్చి జూన్ మధ్య కాలంలో కాలుష్యం బాగా తగ్గిపోయింది. ఊహించని రీతిలో కాలుష్యం తగ్గిపోవడంతో ప్రజలు కూడా స్వచ్చమైన గాలిని పీల్చుకున్నారు. ఎన్నో రోడ్డు ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. ఇదే సమయంలో గాలిలో స్వచ్చత పెరిగి తేమ శాతం పెరిగింది. దీనికి తోడు వరుస అల్ప పీడనాలతో నైరుతి రుతుపవనాలు వెనక్కు వెళ్లడంలో ఆలస్యం కావడం, అంతేకాకుండా పసిఫిక్ మహాసముద్రంలో ప్రతి సంవత్సరం తక్కువ వర్షపాతానికి కారణం అయ్యే ఎల్నినో ప్రభావం ఉపఖండంపై ఏమాత్రం పడలేదు.
ఈ అన్ని కారణాలతో ఈ యేడాది వర్షాలు దంచికొడుతున్నాయి. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం దేశంలోకి ప్రవేశించే నైరుతి రుతు పవనాలు జులైలో ప్రవేశించి రాజస్థాన్ వరకు వెళ్లి సెప్టెంబర్ నుంచి వెనక్కు వెళ్లిపోతాయి. అయితే ఈ సారి మాత్రం సెప్టెంబర్ 28వ తేదీన వెనక్కు బయలుదేరగా మధ్యప్రదేశ్ వద్ద తేమగాలులు, అల్పపీడన గాలులు వీటికి అడ్డంకిగా మారాయి. దీంతో వర్షపాతం నమోదవుతూనే ఉంది. అయితే ఇవి ఎప్పుడు అడ్డు తప్పుకొని రుతుపవనాలు వెనక్కు వెళతాయో తెలియదు. మరో ఐదు రోజుల పాటు ఇలాగే ఉంటాయని అంటున్నారు.
ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం దేశంలోని ఈశాన్య భారతం, హిమాలయ పర్వత రాష్ట్రాల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయి. కానీ ఈ సారి ఈశాన్య భారతంలో వర్షం కురిసింది. సౌరాష్ట్ర కచ్ సబ్ డివిజన్లో సాదారణం కన్నా 126 శాతం, రాయలసీమలో 84 శాతం, ఉత్తర కర్నాటకలో 49, తెలంగాణాలో 46 శాతం వర్షపాతం ఎక్కువగా నమోదైంది. లాక్డౌన్ వల్ల వాహనాలు ఏవీ రోడ్డెక్కలేదు. దీంతో కాలుష్యం ఏమాత్రం వ్యాప్తి కాలేదు. దీని ఫలితంగా వర్షాలు సమృద్దిగా కురుస్తున్నాయి.