ఎన్నికలొస్తే రాజకీయ నాయకులు ఏం మాట్లాడతారో వారికే తెలియదు. లేనిపోని హామీలన్నీ ఇట్లే ఇచ్చేస్తారు. ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలన్న తపనతో వారు ఇలా చేస్తుంటారని చెబుతారు. అయితే ఇప్పుడు అమెరికాలో అధ్యక్ష్య ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ట్రంప్ కూడా ఇలాంటి హామీలే ఇస్తున్నారు.
కరోనా సోకిన అనంతరం ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడా లేని వైద్యం ఆయనకు అందింది. దీంతో పట్టుమని పది రోజుల్లోపే ట్రంప్ కోలుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే విస్కాన్సిన్లోని జానెస్విల్లేలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నుంచి కోలుకునేందుకు తాను తీసుకున్న చికిత్సను అందరికీ ఉచితంగా ఇస్తానని చెప్పారు. తాను త్వరగా కోలుకోవడానికి యాంటీబాడీస్ చాలా అవసరం పడ్డాయని తెలిపారు.
తనలాగే అమెరిక్లనందరూ త్వరగా కోలుకోవడానికి యాంటీబాడీస్ను అందజేస్తామన్నారు. ఉచితంగా కరోనా వైద్యం అందిస్తానని చెప్పారు. ఇక బైడెన్ వస్తే దేశాన్ని షట్డౌన్ చేయడంతో పాటు వ్యాక్సిన్ ఆలస్యం అవుతుంది. దీంతో దేశంలో మహమ్మారి ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని తెలిపారు. నవంబర్ ఎన్నికల్లో డెమొక్రట్ల విజయం మిచిగాన్తో పాటు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పరిస్థితిని మరింత దిగజార్చవచ్చని అన్నారు. కాగా కరోనా బారిన ట్రంప్ కోలుకున్న విషయం తెలుసుకొని అంతా షాకయ్యారు. ట్రంప్కు ఎలాంటి వైద్యం ఇచ్చారని వివరాలు ఆరా తీశారు. తీరా ట్రంప్ ఇప్పుడు ఆయనకు అందించిన చికిత్స ప్రజలందరికీ ఉచితంగా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మరి అమెరికన్లు ఏ విధంగా తీర్పు ఇస్తారో వేచి చూడాలి.