సోనూసూద్ హీరో అవుతున్నారు. ఇటీవల ఎక్కడ ఆపద వచ్చినా సహాయం చేస్తున్న వారిలో ఆయన పేరే మనకు వినిపిస్తోంది. తాజాగా ఓ మహిళకు అండగా ఉండి ఆదుకుంటానని చెప్పారు సోనూ.
మొన్న చిత్తూరు జిల్లాలో ఓ రైతుకు ఎద్దులు కొనిస్తానని చెప్పి ఏకంగా ట్రాక్టర్ కొనిచ్చి సోనూసూద్ మానవత్తం చాటుకున్నారు. దీంతో ఆయన్ను సోషల్ మీడియాలో హీరోను చేసేశారు. అయితే ఎవ్వరికి ఎలాంటి సహాయం కావాలన్నా తాను ముందుండి చేస్తానని ఇదివరకే సోనూసూద్ ప్రకటించారు.
అస్సాంలోని జల్ఫైగురిలో ఓ మహిళకు చెందిన గుడిసె వర్షానికి పూర్తిగా ద్వంసమైంది. ఆమెకు అండగా ఉండేందుకు భర్త కూడా లేరు. నిరుపేద దయనీయ స్థితిలో ఉన్న ఆమె పిల్లలకు అన్నం పెట్టే స్థితిలో కూడా లేదు. దీంతో ఈమె పరిస్థితిని ఓ మహిళ వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేసింది.
ఈ వీడియోపై స్పందించారు సోనూసూద్. రాఖీ పౌర్ణమి సందర్బంగా ఇల్లు లేని చెల్లెమ్మకు ఇల్లు బహుమతిగా ఇస్తానంటూ సోనూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు కనిపించే దేవుడు అంటూ సోనూపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు