వైఎస్ఆర్సీపీలో తనకు అన్యాయం జరిగింది, స్వయానా ముఖ్యమంత్రి దృష్టికి మెయిల్ ద్వారా విషయం తీసుకెళ్లినా తనకు న్యాయం జరగలేదు. అందుకే ఇక ఆత్మహత్య చేసుకుంటున్నా.. ఇవేవో సామాన్యుల మాటలు కాదు. వైకాపా నేత, మాలమహానాడు మహిళా విభాగం రాష్ట్ర అద్యక్షురాలు బుల్లిపల్లి జోనికుమారి చెప్పిన విషయం.
విజయవాడలోని ప్రెస్క్లబ్లో సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆమె తన ఆవేధనను వ్యక్తం చేశారు. వైకాపాలో ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు తనను మోసం చేశారన్నారు. కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ను కలిసి నేరుగా తన బాధ చెప్పుకోలేకపోతున్నానని తెలిపారు. అందుకే విషయాన్ని ట్విట్టర్, మెయిల్ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
తనకు జరిగిన అన్యాయం సీఎంకు తెలియాలని ఈ సమావేశం ఏర్పాటుచేశానని చెప్పి అనంతరం తన వెంట తెచ్చుకున్న విషాన్ని తాగి పడిపోయారు. దీంతో వెంటనే అక్కడున్న వారంత ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులు చేరుకొని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉంది. అయితే మహిళా విభాగం నాయకురాలు ఇలా చేయడంపై పార్టీలో చర్చ మొదలైంది.
ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసినా తనకు న్యాయం జరగలేదని చెప్పారు. దీంతో తమ పార్టీలోని వారికే న్యాయం జరగడం లేదని ఇలా చేస్తే ఇతర పార్టీల వారు మనల్ని విమర్శించేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని పలువురు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. సమస్యలు ఉంటే న్యాయం చేయడానికి చూడాలి తప్ప ఇలా ఆత్మహత్యయత్నాలకు వచ్చేవరకు విషయం రాకూడదని అంటున్నారు. సో చూద్దాం మహిళల అభివృద్ధి గురించి నిరంతరం తపించే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ మహిళ సమస్యపై ఎలా ముందుకెళతారో.