వైసీపీపై మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. గుంటూరులో జరిగిన వైసీపీ జాతీయ ప్లీనరీలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించిన పథకాలను ఎద్దేవా చేశారు. జగన్ ప్రకటించినవి నవ రత్నాల్లాంటి పథకాలు కావని, అవి 9 గులకరాళ్లని యనమల అన్నారు. ఆ హామీల బడ్జెట్ గురించి అసెంబ్లీ ఏర్పాటు చేయడం అనవసరమని ఆయన చెప్పారు.
వైసీపీ హామీలపై ప్రస్తుతం చర్చించడం అనవసరమని, అసందర్భమని ఆయన వ్యాఖ్యానించారు.
వైసీపీ విధ్వంసక ధోరణిని చూసి ప్రజలు భయపడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు వైసీపీ ఇచ్చినవి కొత్త హామీలేమీ కాదని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 24లక్షల మంది రైతులకు రూ.50వేలు ఒకే దఫాలో చెల్లించామని ఆయన తెలిపారు.
కాగా, వచ్చే ఎన్నికల్లో వైసీపీని గట్టెక్కిస్తాడని ఆశలు పెట్టుకున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్కిశోర్ ఆ పార్టీ జెండా పీకేయడం ఖాయమని పరిశ్రమల మంత్రి అమరనాథ్రెడ్డి చిత్తూరులో జోస్యం చెప్పారు. ఓటమి భయంతోనే జగన్ అలవికాని వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు.