కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేసిందన్న ఆనందంలో ఉన్న సమయంలోనే స్ట్రెయిన్ వైరస్ యూకేను అతలాకుతలం చేసేస్తోంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న ఆ దేశం ఇప్పుడు వ్యాక్సిన్ సరఫరాలో కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది. ఓ వైపు కరోనా వైరస్కు వ్యాక్సిన్ అందజేస్తూనే మరోవైపు కొత్త స్ట్రెయిన్ వైరస్ను కట్టడి చేసేందుకు యూకే విశ్వప్రయత్నాలు చేస్తోంది.
కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ ప్రబలిన యునైటెడ్ కింగ్డమ్లో ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు 6 లక్షల మంది ప్రజలకు ఫైజర్ బయోఎన్ టెక్ కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోస్ వేశామని బ్రిటీష్ ప్రభుత్వం తెలిపింది. యూకేలో డిసెంబరు 8 నుంచి 20వతేదీ మధ్య 6,16,933 మందికి కొవిడ్ టీకా వేశామని బ్రిటన్ ఆరోగ్య, సామాజిక సంరక్షణ శాఖ తెలిపింది.ప్రపంచంలోనే యూకే ఫైజర్ బయోఎన్ టెక్ వ్యాక్సిన్ తయారు చేసిన మొదటి దేశంగా నిలిచింది. బ్రిటన్ 40 మిలియన్ల మోతాదుల ఫైజర్ వ్యాక్సిన్ ను ఆర్డరు చేశామని. ఈ ఏడాది చివరికల్లా ఆ మొత్తం టీకాలు అందుతాయని బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాంకాక్ చెప్పారు. 80 ఏళ్ల వయసు వారు, ఆరోగ్య, సామాజిక సంరక్షణ సిబ్బందికి 500 వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా టీకాలు వేశామని సర్కారు వివరించింది.
కరోనా కొత్త స్ట్రెయిన్ బ్రిటన్ దేశంలో ప్రబలుతున్న నేపథ్యంలో పలు ఆంక్షలు విధించడంతోపాటు టీకాలు వేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. స్ట్రెయిన్ వైరస్ ప్రభలుతున్న నేపథ్యంలో యూకేలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇప్పటికే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక యూకేతో సంబంధాలను పలు దేశాలు నిలిపివేశాయి. విమాన సర్వీసులను రద్దుచేసుకోవడంతో పాటు ఇప్పటికే ప్రయాణీకులు వచ్చిన దేశాలు.. వారికి పరీక్షలు చేసే పనిలో నిమగ్నమయ్యాయి.