ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యవహారం అంతుచిక్కడం లేదు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న వైసీపీ ప్రభుత్వం నిర్ణయం ఆయన్ను దిక్కుతోచని స్థితిలో పడేసిందని చెప్పాలి. దీంతో ఎవరు చెయ్యాల్సిన పని మరెవరో చెయ్యాలని ఏదేదో చెబుతున్నారు చంద్రబాబు.
మూడు రాజధానుల నిర్ణయానికి గవర్నర్ వద్ద బిల్లు పాస్ అవ్వడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ఎలా పోరాడాలో తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. 48 గంటల్లో అధికార వైసీపీ ప్రభుత్వం స్పందించాలని.. అందరూ రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళదామని చంద్రబాబు సవాల్ విసిరారు. తమ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎప్పటిలాగే చంద్రబాబు ఆగ్రహంగా మాట్లాడారు.
కాగా మంత్రులు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చంద్రబాబు అమరావతి రాజధాని డిజైన్కు చెంప్పపెట్టు అని బొత్స సత్యనారాయణ అన్నారు. వికేంద్రీకరణను వ్యతిరేకించిన చంద్రబాబుకు విశాఖ వెళ్లే హక్కు, ఉత్తరాంధ్రలో కాలు పెట్టే నైతిక బాధ్యత లేదన్నారు. ఇక తనతో పాటు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలని బొత్స అన్నారు. మరో మంత్రి అనిల్ మాట్లాడుతూ చంద్రబాబుకు ఆయన భూములు, రేట్లు తప్ప ప్రజలపై ప్రేమ లేదన్నారు. నిజంగా ఆయనకు అమరావతిపై ప్రేమ ఉంటే తన ఎమ్మెల్యే పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలన్నారు.
అయితే చంద్రబాబు తీరు ఏంటో అర్థం కావడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలుపొందిన పార్టీ వైసీపీ అయితే టిడిపి ఇలా మళ్లీ రాజీనామాల మాట ఎత్తుకోవడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. అసలు రాజీనామాలు చేయాల్సిన అవసరం అత్యధిక మెజార్టీతో గెలిచిన వైసీపీకి ఏం అవసరం అని సోషల్ మీడియాలో పలువురు మండిపడుతున్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తర్వాత అడ్డుకోవాలని అనుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతగా రాజీనామాలు చేయాలంటే తన 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలే తప్ప జగన్కు ఆ అవసరం లేదని వాదిస్తున్నారు.
ఇక చంద్రబాబు రాజీనామాల మాటలపై ఆయన పార్టీ నేతలే అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రభంజనం ముందు తాము గెలిచామని. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ప్రజలంతా వన్సైడ్ అయ్యారని మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రాజీనామాలు చేస్తే మళ్లీ గెలిచే అవకాశమే లేదని టిడిపి ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాలని అధికార పార్టీ తీసుకున్న నిర్ణయంతో అన్ని ప్రాంతాల వారు హర్షం వ్యక్తం చేస్తుంటే టిడిపి వ్యవహార శైలి భిన్నంగా కనిపిస్తోంది.