సెన్సేషనల్ మెట్రో ప్రాజెక్ట్ కి ఇవాళ మోడీ శ్రీకారం చుట్టారు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టుగా మెట్రో ప్రాజెక్ట్ విషయం లో హైదరాబాద్ వాసులు ఫుల్ ఖుషీ గా ఉన్నారు. నత్తనడక మొదలు అయ్యి ఇంకా నత్త నడకన సాగిన మెట్రో పనులు ప్రస్తుతం ఒక కొలిక్కి చేరుకున్నాయి. నగరం అంతా దీనికి సంబంధించి ఒకటే హడావిడి జరుగుతోంది ప్రస్తుతం. మోడీ చేతుల మీదగా మెట్రో ఓపెనింగ్ ఒక వైపు మరొక ఒఅక్క మెట్రో రైలు పూర్తి చేసింది మేమే అని డప్పు కొట్టుకుంటున్న రాజకీయ పార్టీలు మరొక వైపు.
మెట్రో రైలు పూర్తిచేసింది మేమే అని ఒక పార్టీ నేతలు మైకులు అదరగొడుతుంటే… అబ్బే, దానికి శంకుస్థాపన చేసేంది మేము అంటూ మరో పార్టీ గోల..! అబ్బబ్బే… ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి నిధులు ఇచ్చింది మేము అని ఇంకో పార్టీ డప్పు పట్టుకుంటోంది. ఎవరిగోల వారిది అన్నట్టుగా ఉంది పరిస్థితి. ప్రస్తుతం తెరాస అధికారంలో ఉంది కాబట్టి, హైదరాబాద్ లో మెట్రో పనులు పరుగులు తీయించిన ఘనత మా కేసీఆర్ సర్కారుదే అని వారు ఓ రేంజిలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే నగరంలో భారీ ఎత్తున హోర్డింగులు పెట్టేసి ప్రచారం హోరెత్తిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తోంది. నగరాన్ని గ్లోబల్ సిటీ గా మార్చిన ఘనత తమదే అంటూ చెబుతోంది ఆ పార్టీ. తెలంగాణా కి మెయిన్ ప్రాజెక్ట్ అయిన మెట్రో ని మేము సాధిస్తే కెసిఆర్ తమ ఖాతాలో వేసుకున్నారు అనీ ప్రజలు అంతా గమనిస్తున్నారు అంటూ ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. తెరాస సర్కారు తీరు వల్లనే మెట్రో రైలు మరింత ఆలస్యమైందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత కొత్తగా ఒక్క మీటరుకు కూడా అనుమతి రాలేదనీ, మెట్రో రైలు డిజైన్ చేసిందీ, అనుమతులు తెచ్చిందీ, ప్రారంభించింది కూడా కాంగ్రెస్ హాయంలోనే అనే విషయం ప్రజలకు తెలుసు అన్నారు.
ఇదొక్కటే కాదు.. అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్ అన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయన్నారు. అంతేకాదు, హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించిన ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరొక పక్క బీజేపీ విషయానికి వస్తే కేంద్రం చొరవ , చలవ వల్లనే ఈ మెట్రో మొదలు అయ్యింది అనీ బీజేపీ లేదంటే అసలు మెట్రో నే లేదు అనేది వారి వాదన. అంతర్లీనంగా మెట్రో రైలు పూర్తి కావడానికి తాము కూడా కృషి చేశామన్నట్టుగా వారి ధోరణి ఉంది. మెట్రో రైలు ప్రారంభం వెనక.. తమ కృషి ఉందని ప్రజలకు చెప్పుకోవడం కోసం ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా క్రెడిట్ గేమ్..!