ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్షిప్ నుంచి వివో తప్పుకుంది. గత నాలుగు రోజుల నుంచి ఈ మేరకు సమాచారం బయటకు వస్తున్నా బీసీసీఐ ఇప్పుడే దృవీకరించింది. దీంతో వివో స్థానాన్ని ఎవరు బర్తీ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
భారత్, చైనా మధ్య నెలకొన్న వివాదం కారణంగా చైనా మొబైల్ కంపెనీ వివో ఐపిఎల్ స్పాన్సర్షిప్ నుంచి వైదొలిగింది. ఐపిఎల్ ప్రధాన స్సాన్సర్ అయిన వివో బీసీసీఐకి సంవత్సరానికి రూ. 440 కోట్లు చెల్లించేలా ఒప్పందం ఉంది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాదికి స్పాన్సర్షిప్ రద్దు చేసుకునేందుకు సిద్ధమైంది.
\వివో లేని లోటును ఎవరు బర్తీ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. వివో స్థానంలో స్పాన్సర్షిప్ కోసం చాలా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అయితే బీసీసీఐ మాత్రం కనీసం రూ. 250 నుంచి 300 కోట్ల రూపాయల వరకు స్పాన్సర్షిప్ రావాలని చూస్తోంది. అయితే వివో మాత్రం తన మొత్తం స్పాన్సర్షిప్లో 50 శాతం తగ్గించాలని బీసీసీఐని కోరింది. దీనికి ఒప్పుకోకపోవడంతో ఐపిఎల్తో భాగస్వామ్యానికి విరామం ఇస్తున్నట్లు వివో ప్రకటించింది.
ఐపిఎల్తో స్పాన్సర్షిప్ కోసం ప్రధానంగా బైజూస్, జియో, అమేజాన్, కోకా కోలా సంస్థలు పోటీ పడుతున్నాయి. జియోకు ఈ స్పాన్సర్షిప్ అమౌంట్ అంత ఇబ్బందేమీ కాదు. ఇక బైజూస్ భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపిఎల్కు కూడా స్పాన్సర్ అవ్వాలని ఇప్పుడు యోచిస్తోంది. అయితే బైజూస్కు జియో పోటీ వస్తోంది.
ఇవి కాకుండా ఇప్పుడు అమేజాన్ కూడా వివో స్థానాన్ని బర్తీ చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. కోకాకోలా కూడా ఇందుకోసం సిద్ధమవుతోంది. మరి బైజూస్, జియోను కాదని స్పాన్సర్షిప్ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.