కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పుస్తకంలో పలు అంశాలు రాసిన విషయం తెలిసిందే. తరగతి గదిలో టీచర్ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే విద్యార్థిలా రాహుల్ చాలా ఆత్రుతగా కనిపిస్తారు. కానీ ఒక విషయంపై లోతైన అధ్యయనం చేయాలన్న అభిరుచి మాత్రం ఆయనలో లేదు’ అని ఒబామా పేర్కొన్నారు. బరాక్ ఒబామా ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకం రాశారు. ఒబామా పుస్తకం ఈనెల 17వ తేదీన విడుదల అవ్వబోతోంది.
తాజాగా ఈ పుస్తకంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మాట్లాడారు. పుస్తకంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఎంతగానో ప్రశంసించారని, కానీ 902 పేజీల ఆ పుస్తకంలో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ గురించి ఒక్క ముక్క కూడా లేదని ఎద్దేవా చేశారు. రెండు భాగాల ఈ పుస్తకం అడ్వాన్స్ కాపీ తన వద్ద ఉందని, ఇందులో ఇండియాకు సంబంధించి ప్రతీ అక్షరాన్ని తాను చదివానని ఆయన ట్వీట్ చేశారు. హింసాత్మక ప్రేరణ, దురాశ, అవినీతి, జాతీయవాదం, జాత్యహంకారం, మతపరమైన అసహనం వంటివాటి గురించి ఒబామా చాలా ఆవేదన వ్యక్తం చేశారని థరూర్ పేర్కొన్నారు.
కాగా ఒబామా రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. భారత రాజకీయాల గురించి ఓ విదేశీ నేత ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం సరికాదని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. కాగా ఈ పుస్తకం రేపు రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో అందులో ఇంకేం విషయాలు ఉంటాయో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. భారత రాజకీయాల్లో చర్చించుకునేలా ఒబామా పుస్తకంలో రాసి ఉంటే మాత్రం తీవ్ర చర్చకు దారి తీసే అవకాశం ఉంది.