పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది. బుధవారం పలు కొత్త నిబంధనలు అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ఇస్లాంను అవమానించే, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే అంశాలు, విద్వేష ప్రసంగాలు, పోర్నోగ్రఫీ, దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే అంశాలను నిరోధించడంలో విఫలమయ్యే సామాజిక మాధ్యమాల కంపెనీలకు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు గరిష్ఠంగా 3.14 మిలియన్ డాలర్లు జరిమానా విధించవచ్చు.
పాకిస్థాన్ డిజిగ్నేటెడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోరిన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల కంపెనీలు ఇవ్వాలని ఈ నిబంధనలు పేర్కొంటున్నాయి. డీక్రిప్టెడ్, రీడబుల్, అర్థం చేసుకోదగిన విధంగా ఈ సమాచారాన్ని అందజేయాలి. ట్విటర్, గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థలతో కూడిన ఆసియా ఇంటర్నెట్ కొయలిషన్ ఈ కొత్త నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిబంధనల విస్తృత పరిథి పట్ల తీవ్ర భయాందోళన వ్యక్తం చేసింది. ఈ నిబంధనలను పారదర్శకత లేని ప్రభుత్వ ప్రక్రియ ద్వారా రూపొందించడం తమను మరింత ఆందోళనకు గురి చేస్తున్నట్లు తెలిపింది. డేటా లోకలైజేషన్ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని పేర్కొంది.
ఉచిత, స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ను ఉపయోగించుకునే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. పాకిస్థాన్ డిజిటల్ ఎకానమీ మిగిలిన ప్రపంచానికి దూరమవుతుందని పేర్కొంది. పాకిస్థానీ యూజర్లకు సేవలను అందుబాటులో ఉంచేందుకు తన సభ్యులకు కష్టమవుతుందని పేర్కొంది. ఇదిలావుండగా, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని చెప్తోంది. పాకిస్థాన్ వ్యతిరేక కంటెంట్ను తొలగించడంపై స్పందనలో జాప్యం చేసిన నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలను రూపొందించినట్లు తెలిపింది.