ఏపీలో రాజకీయాలు హీట్ తగ్గడం లేదు. నిన్నటి వరకు ఆలయాలపై దాడులు, తిరుమల డిక్లరేషన్, హిందూ మతం చుట్టూ తిరిగిన రాజకీయాలు కాస్త చల్లబడినట్లే కనిపించినా.. మళ్లీ నేతల కామెంట్లతో ఇవి రాజుకుంటున్నాయి.
తాజాగా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీజేపీ అధిష్టానం పురంధేశ్వరిని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్బంలో ఆమె ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అయితే దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే..పురంధేశ్వరి ఈరోజు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూతో, అందులో రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైంది’ అని విజయసాయిరెడ్డి ట్వీట్లర్లో పేర్కొన్నారు.
దీంతో ఈ విషయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ కుల,మతాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా పనిచేస్తోందన్నారు. వైసీపీ వైఫల్యాల గురించి మాట్లాడితే పురంధేశ్వరిపై కులంపేరుతో దాడి చేస్తారా అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అన్నీ కులమయం చేసిన వైసీపీ కులాల గురించి మాట్లాడం హేయమని బీజేపీ ఏపీ ఇన్చార్జ్ సునీల్ దేవధర్ అన్నారు. దీంతో బీజేపీ, వైసీపీ మళ్లీ మాటల దాడులు మొదలు పెట్టినట్లే కనిపిస్తోంది.