కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా భయపెడుతూనే ఉంది. అందుకే చాలా దేశాలు వ్యాక్సిన్ తీసుకుంటున్నాయి. ప్రధానంగా అమెరికాలో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందిస్తున్నారు. అయితే ఇక్కడే సమస్య వచ్చి పడింది. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పలు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని అంటున్నారు. దీంతో వ్యాక్సిన్ తీసుకోవాలంటే ఆందోళన చెందుతున్నారు.
కరోనా టీకాతో అలర్జీ వచ్చిన సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమెరికా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మొదటి టీకా డోసు తీసుకున్న వారిలో తీవ్రమైన అలర్జీ తలెత్తితే రెండో డోసు తీసుకోవద్దని సూచించింది. అంటువ్యాధుల పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ నిర్వచనం ప్రకారం.. అలర్జీ రియాక్షన్ను తగ్గించేందుకు ఆస్పత్రి చికిత్స అవసరమైన సందర్భాలను తీవ్రమైన కేసులుగా పరిగణించాలి. అయితే..ఆహారం, లేటెక్స్, ఇతర పర్యావరణ కారణాల రీత్యా అలర్జీకి గురయ్యే వారు ముందుగా డాక్టర్లను సంప్రదించి, ఆ తరువాత టీకా తీసుకోవాలని చెప్పింది.
ఇప్పటివరకూ అమెరికా ప్రభుత్వం ఫైజర్, మోడర్నా టీకాలకు అత్యవసర అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఫైజర్ టీకా తీసుకున్న ఐదుగురిలో అలర్జీ లక్షణాలు కనిపించాయి. దీని వెనుక కారణాలు కునుగునేందుకు అక్కడి ప్రభుత్వం విస్తృత స్థాయి అధ్యయనం చేస్తోంది. అమెరికాలో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అందుకే వ్యాక్సిన్కు అత్యవసర అనుమతులు తీసుకొని అక్కడి ప్రభుత్వం ప్రజలకు అందజేస్తోంది.